📰
వారసత్వ భూమి విక్రయంలో సహ వారసులకు ప్రాధాన్యమివ్వాలి
వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలని అనుకున్నప్పుడు వారు తొలుత సహ వారసులకు ప్రాధాన్యం ఇచ్చి అమ్మాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్ 22 ప్రకారం ‘క్లాస్-1 చట్టబద్ధ వారసుల’కు ప్రాధాన్యం ఇచ్చి, వారు కొనుగోలు చేస్తారేమోనని అడగాల్సి ఉంటుందని తెలిపింది. వారు కాదన్నప్పుడే బయటవారికి విక్రయించుకోవచ్చని తెలిపింది. క్లాస్-1 వారసులకు ప్రాధాన్యత పొందే హక్కు ఉంటుందని పేర్కొంది. క్లాస్-1 వారసుల్లో మరణించిన వ్యక్తి జీవితభాగస్వామి, పిల్లలు, తల్లి ఉంటారు. ఎలాంటి వీలునామా రాయని సందర్భంలో వారసత్వ ఆస్తిని పొందే తొలి హక్కు వారికి ఉంటుంది. 22వ సెక్షన్ స్థిరాస్తు లు, వ్యాపారాలకు వర్తిస్తుంది.