గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్థానికులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్గా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వారికి తక్షణమే అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.